హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్12లోని TX హాస్పిటల్లో మంచు మనోజ్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మనోజ్కు వైద్యులు సిటి స్కాన్ అండ్ ఎక్స్-రే పరీక్షలు చేశారు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. కుడి కాలు కండరం నొప్పితో మంచు మనోజ్ హాస్పిటల్కు వెళ్లినట్లు తెలిసింది. సిటి స్కాన్ అండ్ ఎక్స్- రే రిపోర్టులు నార్మల్ రావడంతో మంచు మనోజ్ ఫ్యామిలీకి ఊరట దక్కినట్టయింది. రెండు గంటల పాటు మంచు మనోజ్కు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మనోజ్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు.
ఆస్తులు, విద్యానికేతన్ స్కూల్ విషయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయని ఆదివారం ఉదయం నుంచి మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, మంచు మనోజ్ భార్య మౌనికపై కూడా మోహన్ బాబు దాడి చేశారని ప్రచారం జరిగింది. డిసెంబర్ 8న ఉదయం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒంటిపై గాయాలతోనే పీఎస్కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేశారని, మోహన్ బాబు డయల్ 100 ద్వారా కంప్లైంట్ చేశారని వార్తలొచ్చాయి. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని మోహన్ బాబు పీఆర్ టీం స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించింది.
మోహన్ బాబు విద్యా సంస్థలో కీలక పదవిలో ఉన్న వినయ్, అతడి అనుచరులు మనోజ్పై దాడి చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. మనోజ్ కూడా తన భార్య భూమా మౌనికతో కలిసి TX హాస్పిటల్కు వెళ్లడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు గానీ డయల్ 100 నంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్లింది. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో.. పోలీసులు హుటాహుటిన జల్పల్లిలోని మోహన్బాబు ఇంటికి వెళ్లారు.
రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు. అయితే.. ఇప్పటివరకూ మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వకపోవడం గమనార్హం. మీడియాలో కథనాలు, జల్పల్లిలోని మోహన్బాబు ఇంటికి పోలీసులు వెళ్లడం తప్ప మోహన్ బాబు గానీ, మంచు మనోజ్ గానీ ఈ గొడవలపై నేరుగా స్పందించలేదు.