
శివయ్య ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి గొప్ప విజయం దక్కిందని మోహన్ బాబు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది.
మోహన్ బాబు మాట్లాడుతూ ‘నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. అప్పటినుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
‘కన్నప్ప’ సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీశామనిపిస్తోంది’అని అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ ‘మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వచ్చాం. ఈ సినిమాను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్కు థాంక్స్’అని చెప్పాడు.
‘మోహన్ బాబు గారు, విష్ణు గారు పదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతూ వచ్చారు. ఈరోజు అందరూ ప్రేమను చూపించడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నాడు.
‘కన్నప్ప’కి అన్ని చోట్లా హౌస్ఫుల్స్ పడుతున్నాయని, మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్లలో ప్రభంజనం సృష్టిస్తోందని డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి అన్నారు. నటులు శివ బాలాజీ, కౌశల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ ఈ సక్సెస్లో భాగమవడం హ్యాపీ అన్నారు.