
చిన్న చిన్న గదుల్లో చిన్నారులను కుక్కుతున్నారని విమర్శ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు బందెలదొడ్లను తలపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురుకుల స్కూల్స్ వచ్చినప్పటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ఖమ్మం సంక్షేమ హాస్టల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగో తరగతి స్టూడెంట్ స్పందన చనిపోవడం బాధాకరమన్నారు. హాస్టల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. 20 మంది ఉండాల్సిన గదుల్లో 80 మందిని కుక్కుతున్నారని, ప్రహరీ, సెక్యూరిటీ లేకపోవడంతో బాలికలకు రక్షణ కరువైందన్నారు. గురుకుల స్కూల్స్ నిర్వహణ, సంక్షేమ హాస్టళ్ల తీరుపై స్టడీ కోసం స్టూడెంట్స్ యూనియన్స్తో ఈనెల 22న కమిటీలు వేస్తామన్నారు. అదే రోజు ‘సంక్షేమ హాస్టళ్లు, లోపాలు’ అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.