
హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తో ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించేందుకు కమల దళం ప్లాన్ చేసింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించి.. ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని మంద కృష్ణ పిలుపునిచ్చేలా కాషాయ దళం ఏర్పాట్లు చేస్తోంది.
మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అండగా ఉంటానని మోదీ హామీ ఇవ్వడంతో ఆయన బీజేపీ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేయనున్నారని కమల దళం నేతలు అంటున్నారు. తెలంగాణలో మాదిగల ఓట్లు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు ఎస్సీ నియోజకవర్గాల్లోనే కాకుండా జనరల్ సీట్లలో సైతం వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీ మంద కృష్ణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది.