వర్గీకరణను అడ్డుకున్న పార్టీలను ఓడించండి : మందకృష్ణ

వర్గీకరణను అడ్డుకున్న పార్టీలను ఓడించండి : మందకృష్ణ

మక్తల్/ఊట్కూరు, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసిన పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మక్తల్​లోని బీసీ కాలనీలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి మారిరెడ్డి జలంధర్​రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్​ మోసం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన దళిత బిడ్డల కుటుంబాలను సీఎం కేసీఆర్​ పట్టించుకోలేదన్నారు.

తాను అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక తానే సీఎం కుర్చీలో కూర్చున్నాడన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ ​షా ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ  ఇచ్చారన్నారు. అందుకే అందరూ బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు జలంధర్​ రెడ్డి మక్తల్​ మండలం ఉప్పర్​పల్లి, లింగంపల్లి, సోమేశ్వరబండ, ముస్లాయిపల్లి, అనుగొండ, ఊట్కూరు మండలం అవుసులోనిపల్లి, లక్ష్మీపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. బలరాం రెడ్డి, విజయకుమార్, హన్మంతు, ​గోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.