న్యూఢిల్లీ: ఇప్పటి వరకు దేశంలోని 256 జిల్లాల్లో గోల్డ్ హాల్మార్కింగ్ రూల్స్ను బాగా అమలు చేశామని, ఇక దేశం మొత్తం మీద ఈ రూల్స్ను అమల్లోకి తెస్తామని కన్జూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. దేశంలో అమ్మే గోల్డ్ నగలకు హాల్మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఈ రూల్స్ను 256 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఈ జిల్లాల్లో 14,18, 22 క్యారెట్ల నాణ్యతగల గోల్డ్ జ్యువెలరీలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేశారు. ఈ జిల్లాల్లో కనీసం ఒక అసెయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్ (ఏహెచ్సీ) అయినా ఉందని కన్జూమర్ మినిస్ట్రీ పేర్కొంది. ‘గోల్డ్ హాల్మార్కింగ్ రూల్స్ను అమలు చేయడం ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. ఇక దేశం మొత్తం మీద ఈ రూల్స్ను అమల్లోకి తెస్తాం’ అని ఈ మినిస్ట్రీ తన మంత్లీ రిపోర్ట్లో పేర్కొంది. ఇంకా బీఐఎస్ దగ్గర రిజిస్టర్ అయిన జ్యువెలరీ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావడం, జీరో రిజిస్ట్రేషన్ ఫీజు, ఒక్క సారి రిజిస్టర్ చేసుకుంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండడం వంటి చర్యలను బీఐఎస్ తీసుకుంటోంది. ప్రస్తుతం 1.27 లక్షల జ్యువెలరీలు బీఐఎస్ దగ్గర రిజిస్టర్ అయ్యాయి. అలానే దేశం మొత్తం మీద బీఐఎస్ గుర్తింపు పొందిన 976 ఏహెచ్సీలు ఆపరేట్ అవుతున్నాయి. రూల్స్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం 4.5 కోట్ల నగలకు హాల్మార్క్ వేశారు. గోల్డ్ జ్యువెలరీ ఇండస్ట్రీలో పారదర్శకత పెంచేందుకు ఈ రూల్స్ తెచ్చారు.