
రంగారెడ్డి జిల్లా కొత్తూరు తిమ్మాపురం దగ్గర మామిడి పళ్ళ లారీ బోల్తా పడటంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం ( జూన్ 14 ) షాద్ నగర్ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా హైదరాబాద్ కి చేరుకునే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని లేపుతున్నారు. లారీ బోల్తా పడిందని తెలియగానే..సమీపంలోని ప్రజలు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడ్డ పండ్ల కోసం ఎగబడ్డారు. చేతికి దొరికినన్ని పండ్లను సంచుల్లో, బుట్టల్లో నింపుకొని తీసుకెళ్లారు జనం. లారీ డ్రైవర్ గాయాలతో ఉన్నా కూడా పట్టించుకోకుండా పండ్లను ఎత్తుకెళ్లి పనిలో పడ్డారు జనం.
హైదరాబాద్ శివార్లలో ఇటీవల కాలంలో ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం మాములు అయిపోయింది. ఇటీవల హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రన్నింగ్ కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తులు వెంటనే దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విజయవాడ వైపు నుంచి హయత్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై షాపులు ఉండటంతో జనం భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.