
న్యూఢిల్లీ: తయారీ రంగం జోరు జులై నెలలో కొంత నెమ్మదించింది. ఇలా నెమ్మదించడం వరసగా రెండో నెల. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జులై నెలలో కొద్దిగా తగ్గి 57.7 గా రికార్డయింది. జూన్ 2023 లో ఈ పీఎంఐ 57.8 గా నమోదయింది. పీఎంఐ ఇండెక్స్ కొద్దిగా తగ్గినప్పటికీ దేశంలో తయారీ రంగం గ్రోత్ పటిష్టంగా కనిపిస్తోందని, డిమాండ్ బలంగా ఉండటమే దీనికి కారణమని పీఎంఐ సర్వే తెలిపింది. ఓవరాల్ ఆపరేటింగ్ కండిషన్లు వరసగా 25 వ నెలలోనూ మెరుగుపడినట్లు జులై పీఎంఐ డేటా చెబుతోంది.
పీఎంఐ 50 కి మించితే విస్తరిస్తున్నట్లు, అంతకు తగ్గితే కుచించుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. కొత్త ఆర్డర్ల పెరుగుదలతో జులైలో తయారీ రంగం మొమెంటమ్ కొనసాగుతోందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ చెప్పారు. డిమాండ్ నిలకడగా పెరిగితే, కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఆ మేరకు పెరుగుతుందని పేర్కొన్నారు. గ్లోబల్గా చూస్తే ఇండియా తయారీ రంగంలో ఒక స్టార్పెర్ఫార్మర్గా నిలుస్తోందని అన్నారు.