- ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్సెస్ శంకర్ నాయక్
- మాజీ ఎమ్మెల్యే కామెంట్స్తోమీటింగ్లో ఘర్షణ వాతావరణం..
- శంకర్ నాయక్ మైకు లాక్కున్న ఎంపీ అభ్యర్థి కవిత
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ వేశారు. తర్వాత జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కన్నతల్లి లాంటి బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి కొంతమంది ద్రోహం చేశారని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరించారని కామెంట్ చేశారు.
దీంతో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వర్గీయులు అడ్డు తగలడంతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థి కవిత శంకర్ నాయక్ నుంచి మైకు లాక్కొని ‘జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేసి సమావేశాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మళ్లీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కొట్లాటకు తాను రెడీగా ఉంటానని అనడంతో సమావేశంలో కలకలం రేగింది. కొద్దిసేపటి తర్వాత సమావేశం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్ , పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రియ పాల్గొన్నారు.