మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణం ఏంటో తెలుసా..?

మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణం ఏంటో తెలుసా..?

ఇండియాలోని చాలామంది సెల్ ఫోన్లకు గురువారం (ఆగస్టు 17న) మధ్యాహ్నం ఒక ఎమర్జెన్సీ అలర్ట్‌ (Emergency Alert) అనే మెసేజ్ వచ్చింది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చింది.. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిందో తెలియక మెసేజ్ వచ్చిన వారు గందరగోళానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే..?

ఆ మెసేజ్ ను కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ.. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్‌ వచ్చిందని చెబుతున్నారు. 

భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను తయారు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని పరీక్షించగా.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటల 35 నిమిషాల సమయంలో  దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ వచ్చింది.

Emergency alert : Severe పేరుతో వచ్చిన మెసేజ్ లో ఏమంది..?  

టెలికమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. దీన్ని పట్టించుకోవద్దు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని అందులో ఉంది. గతంలో జులై 20వ తేదీన కూడా కొంతమంది యూజర్లకు ఈ మెసేజ్‌ వచ్చింది.