కలిసిన ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి

కలిసిన ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి
  • మాజీ సీఎం రోశయ్య గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య అపర మేధావి, దార్శనికత కలిగిన గొప్ప నాయకుడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను కలిసిన ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవని అన్నారు. 50 ఏళ్లకుపైగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి చివరి క్షణం వరకు నిబద్ధతగా వున్నారని కొనియాడారు. రోశయ్య మరణవార్తను తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యనే రోశయ్య బర్త్ డే సందర్భంగా కలిశాననని, ప్రస్తుత రాజకీయాల పై చాలా సేపు మాట్లాడారని తెలిపారు. గొప్ప ఆర్ధిక వేత్తగా, సీఎంగా, గవర్నర్ గా ఎంతో సేవ చేశారని, వారిని కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటన్నారు. 
కడసారి చూపు కోసం.. భౌతికకాయాన్ని రేపు గాంధీ భవన్ లో వుంచడం జరుగుతుందని తెలిపారు. ఎంతో మంది సీఎంల కేబినేట్ లో మంత్రిగా పని చేసి తన దైన మార్క్ చూపించిన గొప్ప నాయకుడు రోశయ్య అని కొనియాడారు. 2007 తాను ఎమ్మెల్సీ గా ఎన్నికై మండలి నుండి బయటికి వచ్చే సమయంలో రోశయ్య తనను పిలిచి తమాట్లాడారని గుర్తు చేసుకున్నారు. తన గురించి రోశయ్య ముందే అంచనా వేసి నాకు మంచి భవిష్యత్ వుంటుందని చెప్పారని తెలిపారు. అంశాల వారీగా పట్టు సాధించాలని సూచించారని, అలాగే మాజీ గవర్నర్ హోదాలో మరో కలిసినప్పుడు.. నిపుణులతో సలహాలు సూచనలు తీసుకొని చట్ట సభలో మాట్లాడుతున్నానని చెప్పడంతో ఎంతో సంతోషించారని తెలిపారు. పీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యాక కూడా కలిశానని, ఆయనను కలిసిన ప్రతి సారి కొత్త విషయాలు తెలిసేవని, తన అనుభవాలు గుర్తుచేసే వారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.