- కాంగ్రెస్లో ఆగని ఆందోళనలు
- గాంధీ భవన్తో పాటు రేవంత్ ఇంటి ముట్టడికి యత్నం
- భారీగా పోలీసుల మోహరింపు.. పలువురి అరెస్ట్
- గాంధీభవన్ గేట్లకు తాళాలు.. బారికేడ్లు ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ మూడో లిస్టులో టికెట్ దక్కని పలువురు సీనియర్ లీడర్లు, వారి అనుచరులు మంగళవారం ఆందోళనకు దిగారు. గాంధీ భవన్తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ గేట్లకు తాళాలు వేశారు. లోపలి వాళ్లు బయటకు.. బయటి వాళ్లు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా మెయిన్ గేట్లను బంద్ చేశారు. ఎవరూ రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు టికెట్ రాకపోవడంతో పలువురు సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను చెప్పినోళ్లకు టికెట్ దక్కలేదని దామోదర రాజనర్సింహ, పార్టీకి ఎంత చేసినా న్యాయం జరగలేదని బెల్లయ్య నాయక్, మానవతారాయ్ పార్టీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లోని గాంధీ విగ్రహం ముందు బెల్లయ్య నాయక్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పటాన్చెరు టికెట్ఆశించిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు మంగళవారం రేవంత్ ఇంటిని ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. మరికొందరు గాంధీ భవన్ మెట్లపై ఆందోళన చేయగా, వారిని అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు.
కొడంగల్ టికెట్ ఇయ్యాలంటున్న బెల్లయ్య
మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల నుంచి బెల్లయ్య నాయక్ అప్లికేషన్ పెట్టుకోగా.. టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో కొడంగల్ టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి.. లంబాడాలు ఎక్కువుండే కొడంగల్ నియోజకవర్గాన్ని తనకు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు. ఇటు దామోదర రాజనర్సింహ కూడా టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్, నారాయణ్ఖేడ్ నుంచి సంజీవ్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డికి టికెట్లు ఇవ్వాలని దామోదర విజ్ఞప్తి చేయగా.. ఏ ఒక్కరికీ అధిష్టానం టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీ పెద్దలపై దామోదర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు.
రెబెల్గా పోటీ చేసే యోచనలో మానవతా రాయ్
ఓయూ జేఏసీ నేత కోటూరి మానవతా రాయ్ సత్తుపల్లి టికెట్ఆశించారు. అయితే, ఆయనకు కాకుండా మట్టా రాగమయికి టికెట్ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన భార్యకైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేసినా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన రెబల్గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఆయన భార్య కూడా సత్తుపల్లి నుంచి నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. దీంతో పీసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
చేవెళ్ల అభ్యర్థికి లైన్ క్లియర్?
బీఫాం పెండింగ్లో ఉన్న చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థి భీం భరత్కే మంగళవారం పార్టీ నేతలు బీఫాంను అందజేశారు. నామినేషన్, అఫిడవిట్లలో కేసులకు సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండడం వల్లే భీం భరత్ టికెట్ను పెండింగ్లో పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానిపై పూర్తిగా చర్చించిన తర్వాత ఆయనకు బీఫాంను జారీ చేశారు.