
భద్రాచలం, వెలుగు : ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీలకు అండగా ఉండే మావోయిస్ట్ పార్టీపై దాడులు చేస్తూ 550 మందిని హత్య చేశారని, మే 21న పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.
తెంటు లక్ష్మీనర్సింహాచలం ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టుముట్టి చంపారన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అదెల్లు అలియాస్ భాస్కర్ను, అతని గార్డులను సైతం చంపారని తెలిపారు. వరుస దాడులు, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని కోరారు.