సీఐ కారును పేల్చిన మావోయిస్టులు

 సీఐ కారును పేల్చిన మావోయిస్టులు
  •      ఛత్తీస్​గఢ్​ లోని పర్సేగఢ్​, రాణీబోద్లీ మధ్య ఘటన 
  •     పర్సేగడ్​ ఎస్​హెచ్​వో, హెడ్​కానిస్టేబుల్​కు తప్పిన ముప్పు

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో మావోయిస్టులు బుధవారం సీఐ ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చారు. అయితే, వాహనానికి ముందు పేలడంతో ముప్పు తప్పింది. బీజాపూర్​ జిల్లా పర్సేగఢ్ ​పోలీస్​స్టేషన్​హౌస్​ఆఫీసర్​ ఆకాశ్​ మసీహ్, హెడ్​ కానిస్టేబుల్​సంజయ్ ​బీజాపూర్​ జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో మీటింగ్​కు వెళ్తున్నారు. పర్సేగఢ్–-రాణీబోద్లీల మధ్య సోమన్​పల్లి గ్రామం వద్దకు రాగానే మావోయిస్టులు ముందుగానే అమర్చిన మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో కారు ముందు భాగం ధ్వంసం కాగా సీఐ ఆకాశ్​మసీహ్, హెడ్ కానిస్టేబుల్​ సంజయ్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కాగా రాణీ బోద్లీ పోలీస్​స్టేషన్ ​నుంచి రోడ్​ఓపెన్ ​పార్టీ తనిఖీలు నిర్వహిస్తూ ఇదే మార్గంలో వస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమర్చినట్టు తెలుస్తోంది. ముందుగా సీఐ కారు రావడంతో గుర్తించి పేల్చారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్​ నిర్వహిస్తున్నట్లు బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర యాదవ్​ తెలిపారు.

నారాయణ్​పూర్​లో మందుపాతర నిర్వీర్యం

నారాయణ్​పూర్ ​జిల్లా చోటేడాన్​గర్​ పోలీస్ స్టేషన్ ​పరిధిలోని మాటేనార్,​ గౌర్​ దండ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన మందుపాతరను నిర్వీర్యం చేశారు. కూంబింగ్​కు వచ్చే బలగాలను చంపేందుకు మావోయిస్టులు ఏర్పాటు చేయగా, బాంబు స్క్వాడ్​గుర్తించింది. దీంతో బలగాలకు ప్రమాదం తప్పింది.