
హైదరాబాద్, వెలుగు: టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ చేస్తున్నది తప్పు అని, ఆ తప్పే ఇజ్రాయెల్ కూడా చేస్తున్నదని మేరిలాండ్ మాంట్ గోమేరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్, ప్రొగ్రెస్సివ్ పొలిటిషియన్ మార్క్ ఎరిక్ అన్నారు. ఇది సమర్థనీయం కాదన్నారు. ప్రతీకారానికి.. ప్రతీకారం ఎప్పటికీ ఫలితం ఇవ్వదని తెలిపారు. గాజాలోని ప్రజల ఇండ్లల్లోకి వెళ్లి విధ్వంసం, రక్తపాతం సృష్టించే అధికారం ఇజ్రాయెల్కు లేదని మండిపడ్డారు. రెండు దేశాలూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచించారు. సిద్ధాంతాలు, భావాజాలం కంటే సేవాభావంతోనే ప్రజల మనసులు గెలవొచ్చన్నారు.
ఆదివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ‘అమెరికాలో ప్రొగ్రెస్సివ్ పాలిటిక్స్, ఇండియన్ సొసైటీకి వర్తింపు’అనే అంశంపై సమావేశం జరిగింది. దీనికి ఎన్ఆర్ఐ నాగేందర్ మాధవరం అధ్యక్షత వహించారు. చీఫ్ గెస్ట్గా హాజరైన మార్క్ ఎరిక్ మాట్లాడుతూ.. అమెరికాలో తనకు పోటీగా అత్యంత ధనవంతులు నిలిచినా.. వాషింగ్టన్ పోస్ట్ తనపై రోజుకో నెగిటివ్ న్యూస్ రాసినా.. ప్రజలు తననే గెలిపించారన్నారు. అందుకే సేవాభావం ఎంతో ముఖ్యమన్నారు. ‘‘అమెరికా స్థానిక పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం. అందరికీ ఇండ్లు, విద్య, ఆరోగ్యం వంటి పాలసీలతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించాం. నాపైన మల్టీ మిలియనీర్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇన్వెస్టర్ల నుంచి విరాళాలు తీసుకోకుండానే పోటీ చేసి గెలిచాను”అని ఎరిక్ వివరించారు.
ఎరిక్ గెలుపు రాజకీయ నియంతలకు ఒక గుణపాఠమని నాగేందర్ మాధవరం అన్నారు. ఇండియాలో కూడా ఎరిక్ తరహా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక హక్కులు హరించే దుర్మార్గపు పాలనలోకి దేశాన్ని తీసుకెళ్లాలని కొందరు అనుకుంటున్నారని సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం మాజీ చైర్మన్ కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే మళ్లీ బానిస సంకెళ్లు తగిలించుకోవాల్సిందే అని విమర్శించారు. ఈడీ, సీబీఐని అస్త్రాలుగా చేసుకుని మోదీ ప్రభుత్వం దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని తెలంగాణ ఆప్ కన్వీనర్ సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.సత్యనారాయణ, తిప్పర్తి యాదయ్య, ఆప్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.