
- మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2 శాతం వరకు పతనం
- నష్టపోయిన రియల్టీ, ఐటీ షేర్లు షేర్లను కొన్న ఎఫ్ఐఐలు
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో సెషన్లో కూడా పతనమయ్యాయి. ఇరాన్, -ఇజ్రాయెల్ గొడవ కొనసాగుతుండడంతో పాటు, గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడంతో మన మార్కెట్ కూడా గురువారం (జూన్ 20) రెడ్లో ముగిసింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తాజా పాలసీ మీటింగ్లో కూడా మార్చలేదు. కానీ, ఈ ఏడాది చివరిలోపు రెండుసార్లు రేట్ల కోత ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది.
దీంతో పాటు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయని ఎనలిస్ట్లు పేర్కొన్నారు. సెన్సెక్స్ గురువారం 82.79 పాయింట్లు (0.10 శాతం) తగ్గి 81,361.87 వద్ద సెటిల్ అయింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 81,583.94 లెవెల్ను , కనిష్ఠంగా 81,191.04 లెవెల్ను టచ్ చేసింది. మొత్తం 392.9 పాయింట్ల వ్యత్యాసం చూపించింది. బీఎస్ఈలో 3,018 స్టాక్స్ లాస్లో ముగియగా, 959 లాభపడ్డాయి. 140 స్టాక్స్లో ఎటువంటి మార్పు లేదు.
నిఫ్టీ 18.80 పాయింట్లు (0.08శాతం) తగ్గి 24,793.25 వద్ద ఫ్లాట్గా ముగిసింది. “ఇరాన్, -ఇజ్రాయెల్ గొడవలో యూఎస్ జోక్యం చేసుకుంటుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. యూఎస్ ఫెడ్ రేట్లను మార్చకపోవడం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడంతో ఐటీ షేర్లు పడుతున్నాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల పతనం..
నిఫ్టీ 50, సెన్సెక్స్ గురువారం పెద్దగా పడకపోయినప్పటికీ, మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 1.65 శాతం పతనమవ్వగా, స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 2 శాతం నష్టపోయింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో సర్వీసెస్ 1.68శాతం, రియల్టీ 1.63శాతం, యుటిలిటీస్ 1.61శాతం, పవర్ 1.24శాతం, ఐటీ 1.14శాతం, మెటల్ 1.18శాతం, కమోడిటీస్ 1.05శాతం నష్టపోయాయి.
ఆటో ఇండెక్స్ మాత్రమే లాభపడింది. సెన్సెక్స్ కంపెనీల్లో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, టాటా స్టీల్ ఎక్కువగా పడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతీ ఎయిర్టెల్, మారుతి లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్, హాంగ్కాంగ్ హాంగ్ సెంగ్ మార్కెట్లు పతనమయ్యాయి. దక్షిణ కొరియా కోస్పీ స్వల్పంగా పెరిగింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. “వీక్లీ ఎక్స్పైరీ రోజున మార్కెట్లు డల్గా ట్రేడ్ అయ్యాయి.
మిశ్రమ సిగ్నల్స్ మధ్య దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. అంచనాలకు తగ్గట్టుగానే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో మార్కెట్లో ఎటువంటి రియాక్షన్ కనిపించలేదు” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా చెప్పారు. క్రూడ్ ధరలు జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.26శాతం పెరిగి బ్యారెల్కి 76.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 80 డాలర్ల మార్క్ను దాటితే మరింత పెరిగే అవకాశం ఉంది.
గ్లోబల్గా అనిశ్చితి నెలకొన్నా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం నికరంగా రూ.1,008 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) కూడా రూ.365 కోట్ల షేర్లు కొన్నారు. ఎఫ్ఐఐలు బుధవారం నికరంగా రూ. 890.93 కోట్ల ఈక్విటీలను కొన్నారు. డీఐఐలు రూ. 1,091.34 కోట్ల షేర్లను కొన్నారు.