
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఆదివారం రెండో రోజూ భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. నిత్య కల్యాణాలు చేయించుకునే భక్తుల సంఖ్య 117 జంటలు ఉండటంతో చిత్రకూట మండపానికి వేదికను మార్చారు.
ఉదయం సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు ఆర్జిత సేవగా ఇందులో పాల్గొని అభిషేక జలాలను అందుకున్నారు. మూలవరులను సుందరంగా తీర్చిదిద్ది హారతులు సమర్పించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. కల్యాణమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. 117 జంటలు కంకణాలు ధరించారు. క్రతువును నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. సాయంత్రం వరకు భక్తుల కోలాహాలం సాగింది.