
వేంసూర్, వెలుగు : ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కుంచపర్తి గ్రామం వద్ద గల ఎన్ఎస్పీ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున భారీ గండి పడింది. మెయిన్ కెనాల్ నుంచి మంచినీళ్ల చెరువులోకి నీటిని మళ్లించే ప్లేస్లో మట్టి కొట్టుకుపోవడంతో కట్ట డ్యామేజ్ అయింది. దీనిని గమనించని ఇరిగేషన్ ఆఫీసర్లు శనివారం ఎన్ఎస్పీ కాల్వకు నీటిని వదిలారు. దీంతో కట్ట కోతకు గురై గండి పడడంతో నీరంతా పక్కనే ఉన్న మంచి నీళ్ల చెరువులోకి చేరి అది పూర్తిగా నిండిపోయింది. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గమనించి ఇరిగేషన్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఇరిగేషన్ డీఈ మరియన్న, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని గండిని పూడ్చి వేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో కేఎల్ఐ కాల్వకు...
నాగర్ కర్నూల్, వెలుగు : కల్వకుర్తి ఎత్తిపోతల స్కీమ్ ప్యాకేజీ 29 పరిధిలో గల డి82 ప్రధాన కాల్వకు వెల్దండ మండలం లచ్చాపురం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గండిపడింది. దీంతో పక్కనే ఉన్న పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రధాన కాల్వకు నీటి ప్రవాహాన్ని ఆపితే తప్ప గండికి రిపేర్లు సాధ్యం కాదని తెలుస్తోంది.