
న్యూఢిల్లీ: భారత్,- పాకిస్తాన్ వివాదం కారణంగా అనేక రాష్ట్రాల్లో వినియోగదారులు కొనుగోళ్లను ఆలస్యం చేయడం, ఎంట్రీ-లెవల్ మోడళ్లకు డిమాండ్ మరింత తగ్గడంతో మే నెలలో ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు 3 శాతం తగ్గాయని డీలర్ల సంస్థ ఫాడా శుక్రవారం తెలిపింది. గత ఏడాది మే నెలలో 3,11,908 యూనిట్లతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికల్ రిజిస్ట్రేషన్లు 3,02,214 యూనిట్లుగా ఉన్నాయి.
ఫైనాన్స్ ఇబ్బందులు, సెంటిమెంట్బలహీనపడటంతో ఎంట్రీ- లెవల్ మోడళ్ల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ల సమాఖ్య (ఫాడా) ఒక ప్రకటనలో తెలిపింది. మే నెలలో టూవీలర్ల రిటైల్ అమ్మకాలు సంవత్సరానికి 7 శాతం పెరిగి 16,52,637 యూనిట్లకు చేరుకున్నాయి.
గత సంవత్సరం ఇదే కాలంలో 15,40,077 యూనిట్లు అమ్ముడుపోయాయి. కమర్షియల్ వెహికల్ రిటైల్ అమ్మకాలు ఇదేకాలంలో 4 శాతం తగ్గి 75,615 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 6 శాతం పెరిగి 1,04,448 యూనిట్లకు చేరుకున్నాయని ఫాడా తెలిపింది.