తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ప్రజాభవన్గా మార్చడంతో .. ఇప్పుడు సీఎం కార్యాలయం మరోచోటికి మార్చాల్సి వచ్చింది. దీంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) ప్రాంగణంలోకి సీఎం క్యాంపు కార్యాలయం మారే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణంలో గుట్టమీద ఉన్న బ్లాక్లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ భవనాన్ని ఆదివారం ( డిసెంబర్ 10)న ఎలక్ట్రికల్ వాహనంలో పరిశీలించారు. MCRHRD అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. రేవంత్రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండడంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గర్లోనే (రోడ్ నెం. 25, జూబ్లీహిల్స్) ఉన్న హెచ్చార్డీ ప్రాంగణంలోకి మారే అవకాశం ఉంది.
45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCRHRD) ప్రాంగణంలో 150 మంది కూర్చునే నాలుగు కాన్ఫరెన్సు హాళ్ళు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే రెగ్యులర్గా జరిగే కాన్ఫరెన్సులు, లెక్చర్లు, ట్రెయినింగ్ తదితర యాక్టివిటీస్కు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా విడి ఎంట్రీగా గుట్టమీద ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసేలా ఆలోచనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.