మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల ఎన్నికైన సర్పంచులు శిక్షణకు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ఆదేశించారు. మెదక్ పట్టణంలోని డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ క్యాంపస్లో శనివారం సర్పంచుల అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లె పాలనపై పట్టు సాధించే విధంగా ఈ నెల 19 నుంచి 23వరకు జిల్లాలోని 492 మంది సర్పంచులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నూతన సర్పంచులకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం- 2018 ప్రకారం పంచాయతీ అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్ల బాధ్యతలు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల నిర్వహణను తెలియజేస్తామన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యంపై అవగాహన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వినియోగం, చేపట్టే పనులు, పన్నుల వసూళ్లు, సంబంధిత అంశాలపై వివరిస్తామన్నారు. ఆయన వెంట డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, సంబంధిత అధికారులు ఉన్నారు.
ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు
ఎలక్షన్కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. మెదక్ మున్సిపాలిటీలోని 32 వార్డులు, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేట 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారుచేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ప్రత్యేక అధికారి సంధ్య, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
