రైతు ఇంట.. విత్తన పంట .. ఇక గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి

రైతు ఇంట.. విత్తన పంట .. ఇక గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి
  • నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం పేరుతో కార్యక్రమం
  • ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్​యూనివర్సిటీ శ్రీకారం
  • ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులు ఎంపిక
  • వరి, పెసర విత్తనాలు పంపిణీ
  • మెదక్​ జిల్లాకు 20 మంది సైంటిస్టులు

మెదక్, వెలుగు: నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం వల్ల రైతులు ఆశించిన పంట దిగుబడులు సాధించలేకపోతున్నారు. అంతేకాకుండా వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తన కంపెనీలు నాసిరకం, కల్తీ విత్తనాలు అంటగడుతున్నాయి. అన్నదాతలు  ప్రైవేట్​కంపెనీల మాటలు నమ్మి దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తుండగా పంట సరిగా ఎదగక, తెగుళ్లు సోకి, అనుకున్న దిగుబడి రాక నష్టపోతున్నారు. 

ఈ నేపథ్యంలో రైతు ఇంట విత్తన పంట పండనుంది. గ్రామాల్లోనే రైతులతో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయించి, ఇతర రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకుగానూ ప్రొఫెసర్​జయశంకర్​అగ్రికల్చర్​ యూనివర్సిటీ ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ అనే వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వర్సిటీ సైంటిస్టుల పర్యవేక్షణలో నాణ్యమైన వరి, పెసర పంట విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులకు నామమాత్రపు ధరకే ఇస్తున్నారు. వాటితో సాగు చేయించి, ఉత్పత్తి అయ్యే వడ్లు, పెసర్లను విత్తనాలుగా గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తారు. విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రారంభించారు.

జిల్లాలో1,173 మంది రైతులకు..

ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి వరి, పెసర విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మెదక్​ జిల్లాలో ని 21 మండలాల పరిధిలో 391 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు చొప్పున మొత్తం1,173 మందిని ఎంపిక చేశారు. వారిలో 771 మందికి 10 కిలోల వరి విత్తన బస్తాలు, 402  మంది రైతులకు 4 కిలోల పెసర విత్తన బస్తాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, పాపన్నపేట మండలాల పరిధిలో పెరస పంట సాగు చేస్తారు. అగ్రికల్చర్ సైంటిస్టుల పర్యవేక్షణలో తయారు చేసిన ఆయా విత్తన బస్తాలను రూ.50 నామమాత్రపు ధరకే రైతులకు అందిస్తున్నారు.

దిగుబడి వచ్చే వరకు పర్యవేక్షణ

నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం కార్యక్రమంలో పంపిణీ చేసిన వరి, పెసర విత్తనాలను ఈ వానాకాలం సీజన్​లో సంబంధిత రైతులతో సాగు చేయిస్తారు. విత్తన శుద్ధి చేసింది మొదలు నారు పోసి, నాటు వేసి, దిగుబడి చేతికందే వరకు అగ్రికల్చర్ సైంటిస్టుల పర్యవేక్షణ ఉంటుంది. ఈ మేరకు మెదక్​జిల్లాకు యూనివర్సిటీ నుంచి 20 మంది సైంటిస్టులను కేటాయించారు. పంట దిగుబడి వచ్చాక వరి ధాన్యం, పెసర్లను ఆయా గ్రామాల్లోని మిగతా రైతులకు విత్తనాలుగా వినియోగించేందుకు అందుబాటులో ఉంచుతారు. వీటిని సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.