- మేడారంలో ఆన్ లైన్ మొక్కులు
- మీ సేవ, టీ- యాప్ ఫోలియోలో సదుపాయం
- డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలు
- కిలోకు రూ.60 చొప్పున చెల్లించాలన్న అధికారులు
- ప్రసాదం పోస్టులో ఇంటికి పంపించనున్నట్లు వెల్లడి
హైదరాబాద్: మేడారం వరకూ వెళ్లి వనదేవతలను దర్శించుకోలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. మేడారం దాకా వెళ్లలేని భక్తులు ఉన్నచోటి నుంచే మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తోంది. ఆన్ లైన్లో పేమెంట్ చెల్లించి సమ్మక్క, సారలమ్మలకు బంగారం మొక్కు సమర్పించుకోవచ్చని చెబుతోంది.
కిలో బంగారం (బెల్లం)కు రూ.60 చొప్పున చెల్లించి, ఫీజు కింద రూ.35, ప్రసాదం మీ ఇంటికి పంపించేందుకు పోస్టల్ చార్జీల కింద రూ.100 కట్టేస్తే మీ తరఫున మేడారంలో అమ్మవార్లకు మొక్కుతీరుస్తామని పేర్కొంది. ఆపై పోస్టల్ సర్వీస్ మీ ఇంటికే ప్రసాదం పంపిస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం మీ సేవ, టీ–యాప్ ఫోలియోలలో అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.. అయితే, ఈ ఆన్ లైన్ మొక్కులు చెల్లించే అవకాశం ఈ నెల 21 నుంచి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.