మెడికల్​ పీజీ సీట్లు ఇంకా పెంచుతం: మంత్రి హరీష్రావు

మెడికల్​ పీజీ సీట్లు ఇంకా పెంచుతం: మంత్రి హరీష్రావు
  • గాంధీ మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేషన్​ డేలో హరీష్ రావు 
  • ఆపదలో ఉన్నోళ్లకు డాక్టర్లే దేవుళ్లు
  • వైద్యం ఉద్యోగం కాదు.. గౌరవప్రదమైన వృత్తి అన్న మంత్రి


పద్మారావునగర్, వెలుగు: వైద్యం ఉద్యోగం కాదని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే గొప్ప గౌరవప్రదమైన వృత్తి అని హెల్త్  మినిస్టర్  హరీశ్  రావు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడే రోగికి ఆ క్షణం డాక్టర్లే దేవుళ్లని ఆయన పేర్కొన్నారు. గాంధీ మెడికల్​ కాలేజీ 2017 బ్యాచ్ కు చెందిన 200 మంది మెడికల్​ స్టూడెంట్ల గ్రాడ్యుయేషన్​ వేడుక ఆదివారం రాత్రి గాంధీ కాలేజీ ఆవరణలోని గ్రౌండ్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 
పీహెచ్​సీ, బస్తీ, పల్లె దవాఖాన్లలో పనిచేయాలని, ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వైద్యవిద్యను అందిస్తున్నదన్నారు. సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నా డాక్టర్లు, సైనికులు, రైతులకు మాత్రమే అరుదైన గౌరవం ఉంటుందన్నారు. తల్లి జన్మనిస్తే, ఆపదలో పునర్జన్మను ఇచ్చేది డాక్టర్లే అని కొనియాడారు. ఎంబీబీఎస్​ సీట్ల ర్యాంకింగ్ లో దేశంలోనే తెలంగాణ ఫస్ట్​ ప్లేస్​లో ఉందని, పీజీ సీట్లలో సెకండ్​ ప్లేస్​లో ఉందన్నారు.
 ‘‘గతంలో రాష్ర్టంలో మొత్తం పీజీ మెడికల్​ సీట్లు 1,183 ఉంటే ఆ సంఖ్యను తెలంగాణ వచ్చాక 2,890 కు పెంచినం. త్వరలో మరిన్ని సీట్లను పెంచి, దేశంలోనే పీజీ సీట్లలో కూడా ఫస్ట్​ ప్లేస్​ తెస్తం. నిమ్స్​లో రోబోటిక్​ సర్జరీ ఎక్విప్ మెంట్​ ఇచ్చినం.  దీంతో బెస్ట్​ డాక్టర్స్  తయారవుతున్నారు. త్వరలో వరంగల్ తో పాటు హైదరాబాద్​లో 4 సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తం. అందులో సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రవేశపెడతం. ఆర్గాన్​ ట్రాన్స్​ప్లాంట్​లో రాష్ట్ర సక్సెస్​ రేట్ ఎక్కువగా ఉంది” అని హరీశ్  పేర్కొన్నారు.
మెరిట్​ సాధించిన ఎంబీబీఎస్​ స్టూడెంట్స్​కు మంత్రి గోల్డ్​ మెడల్స్, పట్టాలను  అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్​ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్​ రాజారావు, డిపార్ట్​మెంట్ల హెచ్ఓడీలు, డాక్టర్లు పాల్గొన్నారు.