హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ కౌన్సెలింగ్లో ఏపీకి చెందిన స్టూడెం ట్ గంగినేని సాయి భావనకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ మెడికల్ వర్సిటీలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు సీటు కేటాయించాలని కాదని చెప్పింది. తుది తీర్పుకు లోబడి అడ్మిషన్ ఉంటుందని చెప్పింది. ఇదే తరహాలో దాఖలైన ఇతర రిట్లతో కలిపి ఈ నెల 9న విచారిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ బెంచ్ శుక్రవారం ప్రకటించింది.
2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం తెలంగాణ వాళ్లకే చెందుతాయని ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. రాష్ట్ర విభజన నాటికి ఉన్న కాలేజీల్లో అన్రిజర్వుడు సీట్లు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లకు చెందుతాయని ప్రభుత్వం అంటోంది. ఇది అన్యాయమని ఆమె పిటిషన్ వేశారు.