ఎక్కడికైనా టూర్కి వెళ్తే ఆ ట్రిప్ జీవితాంతం గుర్తుండాలి అనుకుంటారు టూరిస్ట్లు. అందుకనే గిరిజనులు ఉండే కొండ ప్రాంతాల టూర్లకు పోతారు చాలామంది. వాళ్ల కట్టుబొట్టు గురించి తెలుసుకుంటారు. అలాంటివాళ్లకు గుజరాత్లోని సపుతర హిల్స్టేషన్ మంచి ఆప్షన్. ఈ సీజన్లో అక్కడ ‘మేఘ్ మహర్’ అనే ఫెస్టివల్ జరుగుతుంది.
గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ ఈ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇక్కడికి వెళ్తే గుజరాతీ కల్చర్లో భాగం కావొచ్చు. ఈ ఫెస్టివల్ స్పెషల్ ఏంటంటే... ప్రతి వీకెండ్, సెలవు రోజుల్లో సెలబ్రిటీ సింగర్స్, ఆర్టిస్ట్లతో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమినాడు ఆగస్టు 19న ‘దహీ హండీ’ పోటీలు పెడతారు.
ఆటలతో పాటు పడవ పందాలు
సాకర్ గేమ్తో పాటు వర్షం లో మారథాన్లో పరుగెత్తొచ్చు. ఆర్ట్గ్యాలరీలో పెయింటింగ్స్, ఆర్ట్వర్క్స్ని చూడొచ్చు. సపుతర ప్రాంతంలోని వంటకాల్ని టేస్ట్ చేయొచ్చు. అంతేకాదు చెట్లు, కొండలతో ఉండే ఆ ప్లేస్లో ట్రెజర్ హంట్ గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇవేకాకుండా ఫొటోగ్రఫీ వర్క్షాప్స్, పెయింటింగ్, వెదురు పోచలతో బుట్టలు, చాపలు అల్లడం, కుర్చీలు, ఉయ్యాల తయారుచేయడం నేర్చుకోవచ్చు. పడవ పందాలు, క్విజ్ పోటీలు, సెమినార్స్, ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రశాంతత కోసం యోగా క్లాసులు ఉంటాయి. జూన్ 30వ తేదీన మొదలైన ఈ ఫెస్టివల్ఈ నెల 30న ముగుస్తుంది.