సూరత్: మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ కుమార్ చౌదరీ (14 బాల్స్లో 8 సిక్స్లతో 50 నాటౌట్) రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 11 బాల్స్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో లీసెస్టర్ బ్యాటర్ వేన్ వైట్ (12 బాల్స్) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2012లో ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో వైట్ ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరుసగా ఎనిమిది సిక్స్లు కొట్టిన తొలి ప్లేయర్గానూ ఆకాశ్ రికార్డులకెక్కాడు. గతంలో రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్ వరుసగా ఆరు సిక్స్లు మాత్రమే కొట్టారు. ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆకాశ్ తొలి బాల్ను డిఫెన్స్ చేశాడు. తర్వాతి బాల్కు రెండు రన్స్ తీశాడు.
ఆ తర్వాత వరుసగా 8 సిక్సర్లు కొట్టాడు. ఇందులో బౌలర్ లిమార్ డాబి ఆరు సిక్స్లు ఇచ్చుకున్నాడు. ఫలితంగా 11 బాల్స్లోనే 50 రన్స్ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్కు ముందు ఆకాశ్ యావరేజ్ 14.37గా ఉంది. 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతను రెండు ఫిఫ్టీలు మాత్రమే చేశాడు. లిస్ట్–ఎలో 28, టీ20ల్లో 20 మ్యాచ్లు ఆడాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 386/2 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన మేఘాలయ తొలి ఇన్నింగ్స్ను 127 ఓవర్లలో 628/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
అర్పిత్ భటేవారా (207) డబుల్ సెంచరీ చేయగా, రాహుల్ దలాల్ (144), కిషన్ లింగ్డో (119) సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో ఆకాశ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోహిత్ 3, పెంజోర్ మంగల్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 27.4 ఓవర్లలో 73 రన్స్కే ఆలౌటై ఫాలో ఆన్లో పడింది. అమిత్ యాదవ్ (16) టాప్ స్కోరర్. ఆర్యన్ బోరా 4, ఆరోన్, డిప్పూ సంగ్మా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ ఆట ముగిసే టైమ్కు 10 ఓవర్లలో 29/3 స్కోరు చేసింది. మైఎండుంగ్ సింగ్ఫో (13 బ్యాటింగ్), టెచి నెరీ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆకాశ్ చౌదరీ రెండు వికెట్లు తీశాడు.
