ముంబై: టాటా ట్రస్ట్స్లో విభేదాలు మరింత పెరిగాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీని నియంత్రించే ఈ సంస్థలో రతన్ టాటా సన్నిహితుడు, వ్యాపారవేత్త మెహ్లి మిస్త్రీకి చోటు దక్కలేదు. ఆయనను మరోసారి ట్రస్టీగా నియమించడాన్ని ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా, ఆయనకు సన్నిహితులైన మరో ఇద్దరు ట్రస్టీలు అడ్డుకున్నారు. నోయల్ టాటా, టీవీఎస్ మోటార్ కో– ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్, రక్షణశాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్.. మిస్త్రీ పునర్నియమాకాన్ని వ్యతిరేకించారు.
సిటీబ్యాంక్ ఇండియా మాజీ సీఈఓ ప్రమిత్ జవేరి, న్యాయవాది డేరియస్ ఖంబటా, సమాజ సేవకుడు జహంగీర్ ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ట్రస్ట్స్లో నోయల్ టాటా, మెహ్లి మిస్త్రీలు రెండు పవర్ సెంటర్లుగా మారారు.
ట్రస్టీల పునర్నియమాకం ఆటోమేటిక్గా జరుగుతుందా లేదా ఏకగ్రీవ ఆమోదం అవసరమా ? అనే విషయంలో రెండు వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది రతన్ టాటా మరణానంతరం జరిగిన సమావేశంలో అన్ని ట్రస్టీ పదవులను జీవితకాలం చేయాలని నిర్ణయించారు.
