
సింగపూర్: ఫ్రెంచ్ స్విమ్మింగ్ సెన్సేషన్, పారిస్ ఒలింపిక్స్లో నాలుగు గోల్డ్ మెడల్స్తో ఔరా అనిపించిన లియోన్ మర్చండ్ వరల్డ్ ఆక్వాటిక్స్ చాంపియన్షిప్స్లోనూ మెరిశాడు. మెన్స్ 200 మీటర్ల మెడ్లేలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. బుధవారం జరిగిన సెమీ- ఫైనల్లో 1 నిమిషం 52.61 సెకండ్లతో టాప్ ప్లేస్లో నిలిచిన అతను 2011లో అమెరికా స్విమ్మర్ ర్యాన్ లోచ్టే నెలకొల్పిన 1:54.00సెకన్ల రికార్డును అధిగమించాడు. గురువారం జరిగే ఫైనల్లోనూ మర్చండ్ తన రికార్డును మళ్ళీ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
కాగా, ఈ మెగా ఈవెంట్లో ఇండియా స్విమ్మర్ల చెత్త పెర్ఫామెన్స్ కొనసాగుతోంది. మెన్స్ 200 మీటర్ల మెడ్లేలో షోయన్ గంగూలీ 38వ స్థానంతో హీట్స్లోనే వెనుదిరిగాడు. కర్నాటకకు చెందిన 20 ఏండ్ల షోయన్ 2 నిమిషాల 05.40 సెకండ్ల టైమింగ్తో తన హీట్లో ఎనిమిదో స్థానంలో, మొత్తం మీద 38వ స్థానంలో నిలిచి 16 మంది స్విమ్మర్లు పోటీపడే సెమీ-ఫైనల్స్కు క్వాలిఫై అవ్వలేకపోయాడు. షోయన్ గంగూలీ ఇటీవల జరిగిన సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్స్ 200మీ ఇండివిడ్యువల్ మెడ్లేలో 2:04.34 టైమింగ్తో నేషనల్ రికార్డు బ్రేక్ చేశాడు.