న్యూఢిల్లీ: ఇండియాతో పాటు పలు దేశాలపై మెక్సికో 50 శాతం టారిఫ్లను విధించింది. ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లేని ఇండియా, చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాలపై ఈ ప్రభావం పడనుంది.
ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 50 శాతం వరకు టారిఫ్లు వేసే బిల్లును మెక్సికో గురువారం ఆమోదించింది. లోకల్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. కొత్త టారిఫ్ లు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఇండియాపై ఎఫెక్ట్ ఇలా..
ఇండియా నుంచి ఆటోమొబైల్ ఐటమ్స్మెక్సికోకు ఎగుమతి అవుతుంటాయి. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. వోక్స్వ్యాగన్, హ్యుండాయ్, నిసాన్, మారుతి సుజుకీ వంటి కంపెనీల ఎగుమతులపై ఈ ప్రభావం ఉండనుంది. కార్లపై టాక్స్ 20 శాతం నుంచి 50 శాతానికి పెరగనుంది.
దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత ఇండియాకు మూడో అతిపెద్ద కార్ల ఎగుమతి మార్కెట్ మెక్సికోనే. అయితే ఆయా కంపెనీలు ఇప్పటికే మెక్సికోతో చర్చలు జరిపి టారిఫ్లను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మెక్సికో టారిఫ్ల పెంపు నిర్ణయం టెక్స్టైల్స్, కెమికల్స్, మెటల్స్పైనా ప్రభావం చూపనుంది.
అమెరికాను సంతృప్తి పరిచేందుకే ?
మెక్సికో ప్రభుత్వం ఆసియా దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాను సంతృప్తి పరిచేందుకు మెక్సికో ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

