MI vs RR: బౌల్ట్ దెబ్బకు ముంబై విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 126

MI vs RR: బౌల్ట్ దెబ్బకు ముంబై విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 126

సహచర జట్లు సొంతగడ్డపై పరుగుల వరద పారిస్తుంటే, ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత ముంబై మాత్రం చతికిలబడింది. కనీసం పోరాడే లక్ష్యాన్ని కూడా నిర్ధేశించలేకపోయింది. వాంఖ‌డే వేదికగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 125 పరుగులకే పరిమితమయ్యింది. 34 పరుగులు చేసిన పాండ్యా టాప్ స్కోరర్. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టును.. ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవ‌ర్ ఐదో బంతికే రోహిత్ శ‌ర్మ‌(0)ను డ‌కౌట్‌గా వెన‌క్కి పంపిన బౌల్ట్.. ఆ త‌ర్వాత బంతికి న‌మ‌న్ ధిర్‌(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు.  అనంతరం తన మరుసటి ఓవర్ లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ్రెవిస్‌(0)ను వెన‌క్కి పంపి మూడో వికెట్ సాధించాడు. ఆపై కొద్దిసేపటికే ట‌చ్‌లో ఉన్న‌ ఇషాన్ కిష‌న్‌(16)ను బ‌ర్గర్ బోల్తా కొట్టించాడు. దీంతో ముంబై 20 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న పాండ్యా, తిలక్ వర్మ

20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబైని హార్దిక్ పాండ్యా(34; 21 బంతుల్లో 6 ఫోర్లు), తిలక్ వర్మ(32; 29 బంతుల్లో 2 సిక్స్ లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 56 పరుగులు జోడించారు. ఆపై కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ అవ్వడంతో ముంబై కోలుకోలేకపోయింది.

ALSO READ :- MI vs RR: ముగ్గురు గోల్డెన్ డక్.. తీవ్ర కష్టాల్లో ముంబై ఇండియన్స్

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మూడేసి వికెట్లు తీసుకోగా.. నాండ్రే బర్గర్ 2, అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించారు.