ఏటీఎం అనగానే గుర్తొచ్చేది మనీ మెషిన్ ఒక్కటే. కానీ, జమ్మూ కాశ్మీర్ లో మాత్రం మనీ మెషిన్ తోపాటు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. అదే ‘మిల్క్ మిషిన్’. అంటే ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్ లాగే, పాలు కూడా ఎనీ టైం దొరుకుతాయన్నమాట. ఈ కొత్త ఏటీఎం కనిపెట్టింది బడా కంపెనీలు కాదు. బిటెక్ చేసిన అబినీష్ ఖజరియా అనే కుర్రాడు. మరి అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?
లాక్డౌన్.. ఎంతోమంది జీవితాలను మార్చేసింది. కొందరు ఉన్న జాబ్ కోల్పోతే... మరికొందరు వాళ్లకు నచ్చిన కెరీర్ ఎంచుకుని, కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ల లిస్ట్లో చేరిన కుర్రాడు అబినీష్. జమ్మూ జిల్లాలోని సత్వారి ఏరియాకి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న సొహన్జానాలో పుట్టిన అబినీష్ ఖజురియాకు 28 ఏండ్లు. కొవిడ్కు ముందు గురుగ్రామ్లోని
ఎమ్.ఎన్.సి.లో పనిచేసేవాడు. బి.టెక్ కంప్లీట్ చేసిన అబినీష్కి ఐ.టి ఎక్స్పర్ట్ అవ్వాలనేది డ్రీమ్. చేస్తున్న జాబ్ బాగానే ఉన్నా, మంచి సాలరీ వస్తున్నా... ఏదో అసంతృప్తి. దాన్నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉండగా వాళ్ల నాన్న చేసిన పని గుర్తొచ్చింది. అంతే... తన లైఫ్ టర్న్ అయిపోయింది.
నాన్నే ఆదర్శం
అబినీష్ వాళ్ల నాన్న కుల్భూషణ్. రైతు. ఆయన చేసే వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పరిమెంట్స్ చేస్తుంటాడు. అలా చేసే ఇప్పుడు ఎక్జోటిక్ వెజిటబుల్స్ని పండిస్తున్నాడు. ఈ ఇన్నొవేషన్కు గాను ఆయన అవార్డు కూడా అందుకున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ల నాన్న నుంచి చాలా నేర్చుకున్నాడు అబినీష్. ‘‘ఆయనే నా ఇన్స్పిరేషన్. కొవిడ్ లాక్ డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా, పనిచేయాలనిపించలేదు. కొత్త దారిలో వెళ్లాలనే ఆలోచనతో వెంటనే జాబ్ మానేసి, ఇంటికి వచ్చేశా. కాకపోతే కొత్త రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయంలో మా నాన్న ఎక్స్పీరియెన్స్లే నాకు పాఠాలయ్యాయి. కొండంత కాన్ఫిడెన్స్ని తెచ్చిపెట్టాయి. అలా జీరోతో మొదలుపెట్టి గత ఏడాదిన్నరగా బిజినెస్ చేస్తున్నా.
అలా మొదలు
మొదట వంద ఆవులతో మొదలుపెట్టా. నా టెక్నికల్ నాలెడ్జ్తో మోడర్న్ పద్ధతులు కనిపెట్టా. విదేశీ ఎక్స్పర్ట్స్ సాయంతో పాలని హైజెనిక్గా ప్రాసెస్ చేయడమెలాగో నేర్చుకున్నా. తక్కువ ఎంప్లాయిస్ ఉంటే మిల్కింగ్ ప్రాసెస్ సరిగా జరుగుతుంది. అంతేకాదు, పశువులకు దాణా కోసం టోటల్ మిక్స్ రేషియో మెషిన్ తీసుకున్నాడు. అది పశువుల హెల్త్కు సరిపడా మొత్తంలో దాణా ప్రిపేర్ చేస్తుంది. పాల కోసం బల్క్ మిల్క్ కూలర్ కూడా ఉంది. అది నాలుగు డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ని ఇస్తుంది. దానివల్ల ఎ.టి.ఎంలో పాలు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి. ఎ.టి.ఎం.లలో పాలు తీసుకెళ్లే రెగ్యులర్ కస్టమర్స్ ఇబ్బంది పడకుండా ప్రి–పెయిడ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశా. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో మిల్క్ ఎ.టి.ఎం.లు ఏర్పాటు చేశా. ఫ్యూచర్లో మరికొన్ని ఎ.టి.ఎం.లు పెట్టాలనుకుంటున్నా”అంటున్నాడు అబినీష్ ఖజురియా. అయితే గతంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో షబీర్ అహ్మద్ వాగే అనే అతను డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ అండ్ షీప్ హస్బెండరీ సాయంతో మిల్క్ ఎ.టి.ఎం. ఏర్పాటు చేశాడు.