తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తప్పడం లేదు. బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ ఎంఐఎం కౌన్సిలర్లు అడ్డుకోగా... సరూర్ నగర్ డివిజన్ లో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుళ్ల శివప్రసాద్ అడ్డుకున్నారు, మంత్రి కాన్వాయ్ ఎదుట నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత శివప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నిర్మించిన మోడల్ మార్కెట్ ను అక్రమంగా వార్డ్ కార్యాలయంగా మార్చారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటమి భయంతోనే అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తుందని,అరెస్ట్ లకు కాంగ్రెస్ నాయకత్వం భయపడదని మహేశ్వరం కాంగ్రెస్ నాయకురాలు, బడంగ్ పేట మేయర్ పారిజాత తెలిపారు. ప్రజలకు ఉపయోగకరమైన మోడల్ మార్కెట్ ను నడిపించలేని సబితా ఇంద్రారెడ్డి ఆ బిల్డింగ్ ను వార్డ్ కార్యాలయంగా మార్చడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మారుస్తుందని పారిజాత ఆరోపించారు. మంత్రి కాన్వాయ్ అడ్డుకొని అరెస్టైన డివిజన్ అధ్యక్షులు చిక్కుళ్ళ శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్షన్,ఎన్ ఎస్ యూ ఐ రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ రంజిత్ లను ఆమె పరామర్శించారు.