
జగిత్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తు హెచ్చరికలు జారీచేయాలన్నారు. రైతులకు యూరియా లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
సొసైటీలు, మార్క్ఫెడ్ ద్వారా సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. త్వరలోనే ధర్మపురి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీలత, డీఎంహెచ్వో ప్రమోద్, ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీమ్, అధికారులు పాల్గొన్నారు.
గొల్లపల్లి, వెలుగు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నాయకత్వం కార్యకర్తలకు ప్రేరణ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మల్లికార్జున ఖర్గే బర్త్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు.