
వేములవాడ, వెలుగు : కాంగ్రెస్ అంటేనే సోషల్ జస్టిస్కు కేరాఫ్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి సోమవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకువెళ్తోందన్నారు.
మిగులు రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ప్రతి నెలా వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను సైతం కొనసాగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు యువతకు 59 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ స్థాయిలో ప్రజా సంక్షేమానికి కృషి చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. తనకు అప్పగించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట నాయకులు చిలుక రమేశ్ ఉన్నారు.