
హైదరాబాద్, వెలుగు: ఉర్దూ భాష తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని, భాషా సౌభ్రాతృత్వానికి ఇది వంతెనలా నిలుస్తుందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఉర్దూ ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలకు భాషా వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మంగళవారం కింగ్ కోఠి భారతీయ విద్యా భవన్ లో "బెస్ట్ ఉర్దూ టీచర్స్ అవార్డ్స్" కార్యక్రమానికి మంత్రి అటెండ్ అయి టీచర్లకు అవార్డులు అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 173 మంది ఉత్తమ ఉర్దూ టీచర్లకు అవార్డులు ప్రదానం చేశారు.
విద్య, భాష, సాహిత్యం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవార్డులు పొందిన ఉపాధ్యాయులు మంత్రి కృతజ్ఞతలు తెలుపారు. ఉర్దూ భాషాభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ ఆమ్దన్, వక్ఫ్ చైర్మన్ హాజమతుల్లా, కొత్వాల్, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సజ్జాద్ అలీ, టీఎంఆర్ ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీం ఖురేషీ, మైనార్టీ వెల్ఫూర్ సెక్రటరీ షఫీయుల్లాలు పాల్గొన్నారు.