- క్రిస్మస్ పండుగ విందుపై మంత్రి అజారుద్దీన్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రిస్మస్ విందుపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. క్రిస్మస్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విందు జరిగే ఎల్బీ స్టేడియానికి ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఫైరింజన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
హెల్త్, శానిటేషన్, విద్యుత్ శాఖ, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విందుకు భారీ సంఖ్యలో క్రిస్టియన్లు అటెండ్ అయ్యేలా సంఘాలు చొరవ చూపాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ కోరారు. చర్చ్ల నిర్వహకులు, ఫాదర్స్తో సమావేశం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ షఫీయుల్లాతో పాటు విందు నిర్వహణ కమిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి పలువురు నేతలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

