యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో వసతులు లేని కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
గర్భాలయంలో స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఏఈవో రామ్మోహన్ స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే యాదగిరిగుట్ట అద్భుతంగా నిర్మాణమైందన్నారు. కొండపై భక్తుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. భక్తులతో మాట్లాడి ప్రధానాలయ పునర్నిర్మాణం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంటేకార్ పవన్కుమార్, స్థానిక పార్టీ నాయకులు ఉన్నారు.