తెలంగాణను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది : గంగుల కమలాకర్

తెలంగాణను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది : గంగుల కమలాకర్

కొత్తపల్లి, వెలుగు: తెలంగాణను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందని, తనను మూడుసార్లు గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గొంతుకనయ్యానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలం గోపాల్​పూర్ ‌‌ ‌‌లో పలువురు యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ ‌‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో నీళ్లు లేక రైతులు అరిగోస పడ్డారని, స్వయం పాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు జలకళ సంతరించుకున్నాయన్నారు. 60 రోజులు తనకోసం కష్టపడితే ఐదేళ్లు ప్రజల కోసం కష్టపడతానన్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవడం ప్రజల చేతుల్లోనే ఉందని, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల రూపంలో మళ్లీ ఆంధ్రా నాయకులు వస్తున్నారని, కేసీఆర్ ఓడిపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తారన్నారు.   ఈటల రాజేందర్.. గజ్వేల్ ‌‌లో సీఎం కేసీఆర్ ‌‌ ‌‌కు భయపడే హుజూరాబాద్ ‌‌లోనూ పోటీ చేస్తానంటున్నారన్నారు. ఎంపీ బండి ‌‌ సంజయ్ గంజాయి ఆరోపణలు తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కరీంనగర్ గంజాయి రహితంగా ఉండాలని సీపీకి  ‌‌ఇంతకుముందే  చెప్పామన్నారు.

2018లోనూ సర్వేలు కాంగ్రెస్ ‌‌కు అనుకూలంగా ఉన్నా బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు కూడా అలాంటి విజయమే దక్కుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, జడ్పీటీసీ కరుణ--, ఎంపీపీ శ్రీలత-, రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, పార్టీ అధ్యక్షుడు శ్యాంసుందర్​రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజశేఖర్, లీడర్లు సంపత్ రావు,  చందు పాల్గొన్నారు. 

18న మంత్రి కేటీఆర్​ రాక 

ఈ నెల 18న మంత్రి గంగుల కమలాకర్​ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్​ రాంనగర్​ ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రి కేటీఆర్​ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి గంగుల శుక్రవారం పరిశీలించారు. అదే రోజు సిటీలో 30 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.  మంత్రి వెంట మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ శ్రీకాంత్, బీఆర్ఎస్​సిటీ అధ్యక్షుడు హరిశంకర్ పాల్గొన్నారు.