తెలంగాణపై కేంద్రానిది కక్ష సాధింపు చర్య

తెలంగాణపై కేంద్రానిది కక్ష సాధింపు చర్య

బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ముందుగా ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని బీజేపీ నేతలకు చురకలంటించారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లు పెడితే రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సీఎం కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదన్నారు. ఎఫ్ సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకే కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన FRBM నిధులను కావాలనే నిలిపివేసిందని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయకుండా బీజేపీ ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ నిలిపివేసిందన్నారు. వరంగల్ కు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. చాలాసార్లు దరఖాస్తులు పెట్టినా..మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. 

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాదాసు శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రి హరీష్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది అన్నారు. సీఎం కేసీఆర్ కూడా మాదాసు శ్రీనివాస్ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు.