మీటింగులకు అటెండ్ కాని వారికి జీతాలు కట్
మంత్లీ రివ్యూలో ఆఫీసర్లకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలని పదే పదే చెప్తున్నా కొంతమంది మెడికల్ ఆఫీసర్లు, క్షేత్రస్థాయిలో హెల్త్ వర్కర్లు పట్టించుకోకపోవడంపై మంత్రి హరీశ్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్లీ రివ్యూ నిర్వహించారు. పనితీరు మెరుగవ్వని సిబ్బంది, డాక్టర్లను మందలించడంతో పాటు, బాగా పనిచేస్తున్న వారిని గుర్తించి అభినందించారు. రాష్ట్రంలోని సుమారు వందకుపైగా సబ్ సెంటర్ల పరిధిలో ఒక్క డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరగకపోవడంపై ఆయా సెంటర్ల సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లను మంత్రి వివరణ కోరారు. గర్బిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గర్భిణికి 4 సార్లు తప్పకుండా ఏఎన్సీ చెక్ అప్ చేయించాలన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సిజేరియన్ లు 6 శాతం తగ్గాయని, ఇంకా తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో పీహెచ్సీలు, సబ్ సెంటర్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1,239 సబ్ సెంటర్లు, 43 పీహెచ్సీలకు కొత్త బిల్డింగులు మంజూరు చేశామని, 372 పీహెచ్సీల బిల్డింగులకు మరమ్మతులు చేపిస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త బిల్డింగుల నిర్మాణం, రిపేర్ల సమయంలో పీహెచ్సీలు, సబ్ సెంటర్లను నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ పాల్గొన్నారు.
మందులు రెడీగా ఉంచుకోండి
మారిన వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస, చర్మ సమస్యల పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారి వైద్యానికి అవసరయ్యే మందులు, ఇతర ఎక్విప్మెంట్వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. అలాగే వీడియో, టెలీ కాన్ఫరెన్స్లకు అటెండ్ కాని కొంత మంది మెడికల్ ఆఫీసర్లు, రివ్యూ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మీటింగ్ నుంచి లెఫ్ట్ అవుతున్న వారందరికీ ఒక రోజు వేతనాన్ని కట్ చేయాలని అధికారులను ఆదేశించారు.