సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర గవర్నర్ తమిళిసై బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్లా ఉండకుండా రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలతో గవర్నర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్భవన్ కేంద్రంగా మారుతోందన్నారు. కాళేశ్వరం ఎక్కడుందో, భద్రాచలం ఎక్కడుందో తెలియకుండా సీఎం రమేశ్ మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణలోని 7 మండలాలను బీజేపీ కుట్రతో ఆంధ్రాలో విలీనం చేసిందన్నారు. అక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్నారని, ప్రజల అభ్యంతరాలపై ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో బాధ్యతారాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అప్పుల మీద పార్లమెంటులో మాట్లాడకుండా, రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అనంతరం సూర్యాపేట సద్దుల చెరువు ట్యాంక్ బండ్ లో నిర్వహించిన బోటింగ్ ట్రయల్రన్లో మంత్రి పాల్గొన్నారు.
వ్యాపారమే ఈటల నైజం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఈటల రాజేందర్కు ఏ సిద్ధాంతం లేదని, వ్యాపారమే ఆయన నైజమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈటలకు దమ్ముంటే ఆయనతో టచ్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టాలన్నారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్, జాజుల సురేందర్, నోముల భగత్, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దండె విఠల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గజ దొంగల పార్టీలో చేరిన ఆయన నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం మోడీ కాదు కదా, ఆయన జేజమ్మ తరం కూడా కాదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించే స్థాయి ఈటలకే కాదు.. ఎవ్వరికీ లేదని ముఠా గోపాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటల డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్ రావు అన్నారు.