సూర్యాపేటలో ఆఫీసర్లపై మంత్రి జగదీశ్​రెడ్డి ఫైర్​

సూర్యాపేటలో ఆఫీసర్లపై  మంత్రి జగదీశ్​రెడ్డి ఫైర్​

సూర్యాపేట, వెలుగు:‘‘ఎండాకాలం మా కొంపలు ముంచేలా ఉన్నారు.. మీ వల్ల ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది” అంటూ మిషన్​ భగీరథ ఆఫీసర్లపై విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ఫైర్​ అయ్యారు. బుధవారం సూర్యాపేటలో జడ్పీ చైర్​పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన జరిగిన జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​లో ఆయన ఈ కామెంట్లు చేశారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో మిషన్​ భగీరథ నీళ్లు సరఫరా కాకున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఈసమావేశం సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ చెప్పారు.  చిల్పకుంట మెయిన్ గ్రిడ్​లో మోటార్లు పనిచేయకున్నా.. ఆఫీసర్లు ఇప్పటివరకు వాటి రిపేరింగ్​ కోసం బడ్జెట్ ప్రపోజల్స్​ పెట్టలేదన్నారు.


మోటార్లు రిపేర్​ కాకపోవడంతో 15 రోజులకు ఒక్కసారి కూడా గ్రామాలకు మిషన్​ భగీరథ నీళ్లు  ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని  పేర్కొన్నారు. ఆ వెంటనే హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూర్ నగర్ నియోజకవర్గానికి అవంతిపురం గ్రిడ్ ​నుంచి ప్రెజర్​రాకపోవడంతో ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు. కనీసం నీటి సరఫరా పై అధికారులు రివ్యూ కూడా చేయడం లేదు ”అని తెలిపారు. అక్కడే ఉన్న మిషన్​ భగీరథ ఇంట్రా గ్రిడ్​ సీఈలు పాపారావు, వెంకటేశ్వర్లు, అవంతిపురం గ్రిడ్​ డీఈ నవీన్​ స్పందిస్తూ.. మిషన్ ​భగీరథకు సంబంధించి  గ్రామాల్లో 312 సమస్యలు ఉన్నట్లు  గుర్తించామన్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్​.. సరైన  ప్లానింగ్ చేయకుండా, హైట్​లో ట్యాంకులను నిర్మించడం వల్లే నీళ్లు ఎక్కడం లేదన్నారు. ‘‘రైతుల మోటార్లు 60 ఏండ్లు నడుస్తున్నా..  భగీరథ మోటార్లు ఐదేండ్లకే  ఎందుకు రిపేర్లకు వస్తున్నాయో సమాధానం చెప్పండి. గ్రిడ్​లో మోటార్లు నెలకు మూడుసార్లు రిపేర్​కు వస్తున్నయ్. ఎండాకాలం మా కొంపలు ముంచేలా ఉన్నారు. మీ వల్ల ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఈ  ఎండాకాలంలో ఎవ్వరూ సెలవు పెట్టకుండా ఇంటింటికీ భగీరథ నీళ్లందించే ఏర్పాట్లు చేయాలె. పాత సిస్టమ్ వల్లే మేం బచాయిస్తున్నం.ఇప్పటికీ దోసపహాడ్ స్కీం నుంచే సూర్యాపేట మున్సిపాలిటీకి నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంది”అని జగదీశ్​రెడ్డి వ్యాఖ్యానించారు.