![ఏపీ వాళ్లు రాయలసీమ కట్టిన్రు..మీరెందుకు పాలమూరు కట్టలే? : మంత్రి జూపల్లి](https://static.v6velugu.com/uploads/2024/02/31_TtvRkmGJ8i.jpg)
హైదరాబాద్, వెలుగు : ‘‘ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల నిర్మించింది. తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు.. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్స్కీం ఎందుకు నిర్మించలేదు? ఏపీ వాళ్లు సమర్థులు.. మీరు అసమర్థులా? దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి.” అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్రావు మాటలు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్’ అన్నట్టుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల ఆపరేషన్ ఉండాలని నిర్దేశించారని.. అలాంటప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఎందుకు అంగీకరించారని మంత్రి ప్రశ్నించారు.
ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లను కూడా తెలంగాణలో వాడుకోలేక పోయామన్నారు. నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ ఎందుకు రాజీ పడిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో అవినీతి జరగలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ను జూపల్లి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే గత ప్రభుత్వానికి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసి.. పాలమూరును మాత్రం నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక చట్టాలకు బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని, అప్పుడే నీటి వాటాలు తేల్చాలని పట్టుబట్టకుండా ఎందుకు రాజీ పడ్డారని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్తో బీఆర్ఎస్పొత్తు పెట్టుకుందని, వైఎస్ కేబినెట్లో బీఆర్ఎస్కు ఆరు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని గుర్తుచేశారు. అందులో ఇరిగేషన్శాఖ మంత్రి పదవి నీటి పారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ రావుకు ఇస్తామని కేసీఆర్ చెప్పారని, ప్రమాణ స్వీకారానికి ప్రొఫెసర్ జయశంకర్, హరగోపాల్లాంటి వాళ్లు పూల దండలతో విద్యాసాగర్రావును అభినందించేందుకు వస్తే ఆయనకు మంత్రి పదవే ఇవ్వలేదని తెలిపారు. అప్పుడే విద్యాసాగర్రావును మంత్రి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని మంత్రి జూపల్లి అన్నారు.