- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చరిత్ర, వాస్తు నిర్మాణ వైభవం, ఉజ్వలమైన స్ఫూర్తిని, సాంస్కృతిక గర్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఫిబ్రవరి 1న ‘హైదరాబాద్ హెరిటేజ్ రన్ (హెచ్ హెచ్ఆర్)-2026’ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
మంగళవారం తారామతి బారామతి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఈవెంట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి జూపల్లి పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పర్యాటక & సాంస్కృతిక శాఖ (క్రీడలు) ఆధ్వర్యంలో..ర్యాపిడో టైటిల్ స్పాన్సర్గా, తెలంగాణ టూరిజం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్స్) సహకారంతో హెరిటేజ్ రన్ ఈవెంట్ జరగనుందని మంత్రి చెప్పారు.
21కే హాఫ్ మారథాన్..చార్మినార్ నుంచి ప్రారంభమై కుతుబ్ షాహీ సమాధుల వద్ద(మార్గంలో హైకోర్టు, సిటీ కాలేజ్, అసెంబ్లీ, గోల్కొండ కోట, తారామతి బారామతి) ముగుస్తుందని తెలిపారు. ఇక 5కే, 10 కే రన్ చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుందని వివరించారు. “ఇది కేవలం ఒక పరుగు మాత్రమే కాదు. క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక గర్వం కలిసిన మహా వేడుక.
దీని ద్వారా హైదరాబాద్ను ప్రపంచ వారసత్వ క్రీడా పర్యాటక గమ్యస్థానంగా స్థిరపరుస్తాం” అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో నగరవాసులు, యువత, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని హెరిటేజ్ రన్ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. సమావేశంలో తెలంగాణ టూరిజం ఎండీ క్రాంతి వల్లూరు, ర్యాపిడో హైదరాబాద్ హెడ్ ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.
