మిస్ ఇంగ్లాండ్ పై ఏమీ జరగలేదు..ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు: మంత్రి జూపల్లి

మిస్ ఇంగ్లాండ్ పై ఏమీ జరగలేదు..ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు: మంత్రి జూపల్లి

తనపట్ల మిస్ బిహేవ్ చేశారని  మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను ఖండించారు మంత్రి జూపల్లి. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  మిస్ ఇంగ్లాండ్ ను  ఇబ్బంది పెట్టారనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వచ్చిన వాళ్లు చివరిదాకా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వాళ్లను ఇబ్బంది పెడితే..మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు జూపల్లి. మిస్ వరల్డ్ విన్నర్ గా గెలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆథిత్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు నచ్చాయని చెప్పారు.  తన జీవితంలో హైదరాబాద్ ను మరువ..అవకాశం వస్తే  మళ్లీ  ఇక్కడికి  వస్తానని ఓపల్ సుచాత చెప్పారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

మిస్ వరల్డ్ పోటీదారులకు  లక్ష రూపాయలకు ప్లేట్ మీల్స్ భోజనం పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..వాళ్లకు పెట్టిన భోజనం ప్లేట్ మీల్స్ రూ.8 వేలేనని జూపల్లి వివరణ ఇచ్చారు. 

మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా నిర్వహించామన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పోటీదారులు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం అని చెప్పారు.