బీఆర్​ఎస్ చేసిన అప్పులు కడుతూ.. పథకాలు అమలు చేస్తున్నం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

బీఆర్​ఎస్ చేసిన అప్పులు కడుతూ.. పథకాలు అమలు చేస్తున్నం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

నిజామాబాద్, వెలుగు : ‘ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది సీఎంలు 64 ఏండ్లలో రూ.రూ.64 వేల కోట్ల అప్పులు చేస్తే.. 10 ఏండ్లలో బీఆర్​ఎస్​ సర్కార్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది.. నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతున్నం.. అప్పులు మోస్తూనే ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నం..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.

మహిళలకు ఫ్రీ బస్,  ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ , సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.   సన్న బియ్యం పంపిణీ కోసం ఖాళీగా ఉన్న రేషన్​ షాప్​లకు డీలర్లను నెల రోజుల్లో నియమించాలన్నారు.

వంట గ్యాస్​ల రాయితీ అందరికీ అందేలా చూడాలన్నారు.  వడ్లు కొనుగోలుకు సంబంధించి రైతులకు రశీదు ఇవ్వాలని,  కాంటాలు క్లోజ్​ అయ్యేదాకా జిల్లాలో టోల్​ఫ్రీ నంబర్​, కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేయాలన్నారు.  ఎండా కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  బోరు బావులు అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలన్నారు.

భూ భారతిపై ప్రతి మండలంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. త్వరలో అసైన్​మెంట్​ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆర్మూర్ టౌన్​లోని గుండ్ల చెరువులో రూ.3 కోట్ల తో నిర్మించే మినీ ట్యాంక్​ బండ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  

మామిడిపల్లి విలేజ్​లో లక్కారం తవ్వన్న కుటుంబీకులతో కలిసి మంత్రి జూపల్లి, కలెక్టర్ రాజీవ్​గాంధీ తదితరులు సన్నబియ్యం భోజనం చేశారు.  ఆర్మూర్​, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలోనివారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను మంత్రి అందజేశారు.  సమీక్షలో ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, ఉర్దు అకాడమీ చైర్మన్​ తాహెర్​, వినయ్​కుమార్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.