- మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ లో ఈ నెల 17న సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తారని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డితో కలిసి రివ్యూ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రూ.1,200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా ట్రిపుల్ఐటీ కాలేజీ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, ఎంవీఎస్ కాలేజీ బిల్డింగ్ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనతో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. సీఎం పర్యటనను సక్సెస్ చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కృషి చేయాలని సూచించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ బిల్డింగ్ నిర్మించే చిట్టబోయినపల్లి ప్రాంతాన్ని, సీఎం సభ నిర్వహించనున్న ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్ను ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
