
- ఫిర్యాదులతో వచ్చే ప్రజల పరిస్థితి ఏం కావాలి: మంత్రి కోమటిరెడ్డి
- అందరూ టైమింగ్ పాటించాలి
- లేట్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫైర్
- సెక్రటేరియెట్లోని ఆర్ అండ్ బీ సెక్షన్లో తనిఖీ
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లోని ఆర్ అండ్ బీ సెక్షన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం 11:30 గంటలు దాటినా సగం సిబ్బంది కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఫిర్యాదులతో ప్రజలు వందల కిలో మీటర్ల దూరం నుంచి ఎంతో ఆశగా సెక్రటేరియెట్కు వస్తుంటారని తెలిపారు. మెజార్టీ ఉద్యోగులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఆఫీస్కు లేట్ గా వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఫైర్ అయ్యారు. అధికారులతో పాటు ప్రజలందరికీ ఆర్ అండ్ బీ సెక్షన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇలా లేట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేండ్లుగా సీఎం, మంత్రులను కలిసే అవకాశం లేక లక్షలాది మంది ప్రజలు ఫిర్యాదులు ఇవ్వలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కారం కావాలంటే తామంతా కలిసి పని చేయాలని సూచించారు.
ప్రజలు తనకు ఎన్ని వినతులు ఇచ్చినా.. చివరిగా పరిష్కరించాల్సింది ఉద్యోగులే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలన సక్సెస్ కావాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఉద్యోగుల్లేకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగుల కృషి ఎంతో అవసరమని చెప్పారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఎంతో ప్రాధాన్యత ఉన్న సెక్రటేరియెట్కు ఉద్యోగులు లేట్గా రావడం సరికాదన్నారు. ఇక నుంచి అందరూ టైమింగ్ పాటించాలని సూచించారు.