- కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి
- ఇప్పటికే ఏడుసార్లు లేఖలు రాశామన్న మంత్రి
సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ (సీపీసీడీఎస్) కింద ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే ఏడుసార్లు లేఖలు రాశామని, పలు సందర్భాల్లో స్వయంగా వెళ్లి అభ్యర్థించామని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు కేంద్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో సిరిసిల్ల మేజర్ హ్యాండ్లూమ్ హబ్గా ఉందని, ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా చేనేత వస్త్ర ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఇక్కడ పరిశ్రమ స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వరంగల్లో ప్రపంచ శ్రేణి మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
ప్రోత్సాహమేదీ?
చేనేత, జౌళి పరిశ్రమను ప్రోత్సహించేందుకు తాము చేపట్టిన చర్యలను కేంద్రం పలు సందర్భాల్లో ప్రశంసించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ పరిశ్రమ అభివృద్ధికి ఆశించినంత ప్రోత్సాహకం లభించడం లేదన్నారు. అభివృద్ధిలో నడుస్తున్న మన రాష్ట్రానికి కేంద్రం ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో చిన్న దేశాలతో పోటీ పడలేని స్థితిలో మన దేశం ఉందన్నారు. కొన్నేళ్లుగా కేంద్రం సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేని రాష్ట్రాలకు పారిశ్రామికంగా ప్రోత్సహకాలు అందజేస్తోందని, ఇది తమలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తోందన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.